సిట్కో కొత్త యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్కో కొత్త యూనిట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ విభిన్న సంస్క్కతుల సమ్మేళనంగా ఉందని, దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేతిక రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షల నుండి 10 లక్షలకు పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుంది. అర్థంలేని మాటలకు, ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్య, అకడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు పగడ్బందీగా ఉన్నాయని తెలిపారు.
ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం ఇక్కడ ఒక కేంద్రం నిర్మించబడుతోందని తెలిపారు. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అవుతుంది. దీనికి హైదరాబాద్ను ఎంపిక చేసుకొని సిట్కో తెలివైన పని చేసిందన్నారు. సిట్కో మనీలాలో 3500 మంది ఉండగా, టొరంటో కేంద్రంలో 2500 మందే ఉన్నారు. హైదరాబాద్లో అమెజాన్ యొక్క అతిపెద్ద క్యాంపస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, ఉబెర్, మైక్రోన్, క్వాల్కామ్ వంటి సంస్థల రెండవ అతిపెద్ద క్యాంపస్కు నిలయంగా హైదరాబాద్ మారిందన్నారు. ఈ క్రమంలో సిట్కోకు చెందిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో ఉండాలని, దానిని సాకారం చేద్దాం అని తెలిపారు.













