ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. 99 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిగిన కార్యక్రమాలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలు తాము జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాయి.
99 రోజుల యాక్షన్ ప్లాన్లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతినెలా క్షేత్రస్థాయికి వెళ్లాలని గతంలోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు. వారిపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో.. వెంటనే వివరణ కోరాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దని హెచ్చరించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలను కొన్ని విభాగాలు ఆశించినంతగా చెప్పుకోలేకపోయాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలకు తగినంత ప్రచారం కల్పించాలని సూచించారు. సంబంధిత ఉన్నతాధికారులు ఆ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తాము చేసిన మంచి పనులు చెప్పుకోవాలని అధికారులకు సూచించారు.
వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ను నమోదు చేయాలని, గ్రామాల్లో వచ్చిన సమస్యలను కూడా ఆయా శాఖలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన శంకుస్థాపనలు, ఆస్తుల వివరాలన్నీ నమోదు చేయాలని చెప్పారు.
ఇప్పటికీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలుంటే.. వెంటనే ఆ జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడ కొత్తగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను కూడా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యా, వైద్య విభాగాల్లో అన్ని స్థాయిల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్ సీ నుంచి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వరకు ఉద్యోగులందరికీ ఇదే అటెండన్స్ విధానం పాటించాలన్నారు.
రాష్ట్రస్థాయిలో 99 రోజుల యాక్షన్ ప్లాన్పై సమీక్ష నిర్వహించినట్లే.. జిల్లాల వారీగా వెంటనే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై వెంటనే సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి, ఆ జిల్లాకు పంపించాలని చెప్పారు. స్పెషలాఫీసర్ ఆ జిల్లా కలెక్టర్ కలిసి అన్ని విభాగాల్లో 99 రోజుల పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ పథకాలపై వచ్చిన స్పందనలన్నింటినీ సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఈ ప్రగతి నివేదికలను విడుదల చేయాలని చెప్పారు.
జిల్లాలతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుకున్న లబ్ధిదారులు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచాలని చెప్పారు.
తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం అధికారులను ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి హామీల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు.








