ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేటాయించింది. అయితే కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులపై కేంద్రం హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది.













