జీవో నంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నవంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.













