మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ : సీఎం రేవంత్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్షల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ అథ్లైట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసింది. 10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అని అన్నారు.