సాయి కృష్ణ కేసులో సంచలన పరిణామాలు..!
విజయవాడలో(Vijayawada) సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందుకు తెచ్చేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణలంకకు చెందిన ఒక ఆర్ఎంపీ (RMP) డాక్టర్ను మరియు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ను సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తేలిన వివరాల ప్రకారం.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణపై పోలీసులు దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆ చిత్రహింసల భరించలేక సాయికృష్ణ లాకప్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘోరం జరగగానే చట్టప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన పోలీసులు.. కేసును తారుమారు చేసేందుకు ఒక భయంకరమైన స్కెచ్ వేశారని సిట్ గుర్తించింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక ఆర్ఎంపీ (RMP) డాక్టర్ను అర్ధరాత్రి వేళ అత్యవసరంగా పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
చనిపోయిన సాయికృష్ణకు ఆ డాక్టర్తో రహస్యంగా వైద్యం చేయించినట్లు, కేసును కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ హైడ్రామా నడిపినట్లు సిట్ అధికారులు తాజాగా ఆధారాలతో సహా గుర్తించారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కాస్తా మీడియా ద్వారా వెలుగులోకి రాగానే.. ఖాకీల అండ చూసుకున్న సదరు ఆర్ఎంపీ డాక్టర్ విజయవాడ వదిలి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేయడంలో ఆ డాక్టరే అత్యంత కీలకమైన వ్యక్తి కావడంతో, సిట్ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలించి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఒక రహస్య ప్రాంతంలో ఆ డాక్టర్ను ఉంచి, ఆ రాత్రి స్టేషన్లో అసలు ఏం జరిగిందనే కోణంలో సిట్ అధికారులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇదే కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్ను కూడా సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. సాయికృష్ణను నిర్బంధించిన సమయం నుండి, మృతదేహాన్ని తరలించి సాక్ష్యాలను నాశనం చేసే వరకు ఈమె పాత్ర ఏంటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజు జైల్లో ఉండగా, అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిలు నిన్ననే ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు.








