రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులపై సర్కార్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నోటిఫైడ్ పరిధిని (Port Limits) ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ప్రభుత్వం ఈ పోర్టుల పరిధిని అత్యధిక కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లను సవరిస్తూ కూటమి ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం రెండు పోర్టుల పరిధిని చెరి 15 కిలోమీటర్లకు పరిమితం చేశారు. గతంలో రామాయపట్నం నాన్-మేజర్ పోర్టు పరిధిని సముద్ర తీరం వెంబడి ఏకంగా 51 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
అయితే ఇంత పెద్ద పరిధి అవసరం లేదని భావించిన ప్రస్తుత ప్రభుత్వం, దానిని కేవలం 15 కిలోమీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోర్టు పరిధిని కూడా గతంలో సముద్ర తీరం వెంబడి 64 కిలోమీటర్ల మేర నోటిఫై చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ విస్తీర్ణాన్ని కూడా భారీగా తగ్గించి, కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం చేశారు. పరిధి తగ్గించడానికి గల ప్రధాన కారణాలు ఒకసారి చూస్తే.. పోర్టుల పరిధి 50 నుండి 64 కిలోమీటర్ల మేర ఉండటం వల్ల ఆయా తీర ప్రాంతాల్లో స్థానిక మత్స్యకారులు వేటాడటానికి, బోట్లు నిలుపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వారి జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోర్టుల పరిధి ఎక్కువగా ఉంటే ఆ పరిధిలో కొత్తగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు పరిధి తగ్గించడం వల్ల తీరప్రాంతంలో ఇతర అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. ఓడరేవుల నిర్వహణ, భద్రత మరియు పరిపాలన కేవలం పోర్టు అవసరాలకే పరిమితం కావడం వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగదని, అదే సమయంలో స్థానిక మత్స్యకార గ్రామాలకు పెద్ద ఊరట లభిస్తుందని తీరప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








