మంత్రి అంబటినీ నిలదీసిన గంగమ్మకు.. జనసేన సాయం
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును నిలదీసిన బాధితురాలికి జనసేన పార్టీ తరపున రూ. లక్ష చెక్కును అందించి సాయం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా బాధితురాలు తురకా గంగమ్మకు చెక్కు అందజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసినందుకు గంగమ్మకు మంత్రి రాంబాబు తీవ్ర అన్యాయం చేశారని మనోహర్ మండిపడ్డారు. ఆయన బాగోతాన్ని బయటపెట్టినందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 5 లక్షల చెక్కును సైతం వెనక్కి పంపించారని, ఆమెకు ఆ డబ్బులు తిరిగి వచ్చేంత వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. గంగమ్మకు పరిహారం అందించడంలో అలసత్వం చూపించిన అధికారులను వదలబోమని మనోహర్ హెచ్చరించారు. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు రావాల్సిన ఇంటిని కూడా ఆపేశారని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.













