అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు
అగ్రి గోల్డ్ బాధితులకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్ చేసిన వారికి ఆ మొత్తాలను చెల్లించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.
రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్ సునీల్కుమార్ చెప్పారు.













