నిప్పులా బతికాను.. నేను ఏ తప్పూ చేయలేదు : చంద్రబాబు
జగన్ పాలనలో అన్నీ అరాచకాలే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్ సైకో సీఎం మాత్రమే కాదు కరుడుగట్టిన సైకో. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇసుక అక్రమాలపై ఎన్జీటీలో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారు. రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేయొచ్చు. లేకుంటే దాడి చేస్తారు. నిప్పులా బతికాను, నేను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు.













