విశాఖ మహానాడులో చంద్రబాబు
విశాఖ: తెదేపా 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా తెదేపాకు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. తొలుత సభికులు, మీడియాకు ఆయన అభివాదం చేశారు. ‘36ఏడాదిలో అడుగుపెట్టిన తెదేపా యుక్త వయస్సులో ఉంది. మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెదేపా. హుద్హుద్ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది’ అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పునర్ అంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామన్నారు.













