AP Cabinet: మంత్రులకు చంద్రబాబు మళ్లీ క్లాస్..! అలవాటైపోయిందా..?

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తన మంత్రివర్గ సహచరుల (Ministers) పనితీరు పట్ల మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఆయన మంత్రులకు క్లాస్ తీసుకోవడం పరిపాటి అయిపోయింది. అయినా, వాళ్లలో ఆశించినంత మార్పు రాకపోవడంపై ఇవాల్టి కేబినెట్ మీటింగులో (Cabinet Meeting) ఆయన గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.
అమరావతిలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. అదే సమయంలో వాళ్ల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా, వాటిని ప్రజలకు సమర్థంగా, విస్తృతంగా వివరించడంలో మంత్రులు చొరవ తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించినా కూడా ఆ విషయాన్ని ప్రజలకు సరిగా చేరవేయలేకపోయామని ఆయన పదే పదే గుర్తు చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు విద్యుత్ టారిఫ్లను పెంచుతూ పోయాయి కానీ ఎప్పుడూ తగ్గించలేదు. కానీ తొలిసారి ఈ ప్రభుత్వం టారిఫ్ లను తగ్గించింది. యూనిట్కు 13 పైసల చొప్పున వెసులుబాటు కల్పించింది. అయినా దీన్ని చెప్పుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాక, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను, విమర్శలను వెంటనే, ధీటుగా తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.
మంత్రుల పనితీరు మెరుగుపడాలంటే, ప్రజా సంబంధాల విషయంలో మరింత చురుకుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన విషయాలపై తరచుగా మీడియాతో మాట్లాడాలని, ప్రభుత్వ నిర్ణయాలను, విజయాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఏ చిన్న అంశం ప్రజల్లోకి వెళ్లినా, తక్షణమే స్పందించి వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన ఉద్ఘాటించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలకే పరిమితం కాకుండా, రాజకీయ అంశాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
మంత్రుల పనితీరు మెరుగుపడకపోతే పదవులు పోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రుల పనితీరుపై తాను ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నానని, అలాగే ఫైల్స్ క్లియరెన్స్లో ఎంత సమయం తీసుకుంటున్నారనే దానిపై కూడా నిఘా ఉంచానని సీఎం చంద్రబాబు తెలిపారు. పదేపదే హెచ్చరించినా మంత్రులు గేర్ మార్చకపోతే, ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని, వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడం తనకు క్షణాల్లో పని అని ఆయన కఠినంగా చెప్పినట్లు తెలిసింది.
మొత్తంమీద, ప్రభుత్వ పాలనా సంస్కరణలతో పాటు, ముఖ్యంగా ప్రభుత్వ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో మంత్రులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, ఎన్నిసార్లు క్లాస్ తీసుకున్నా మంత్రుల వైఖరిలో మార్పు రాకపోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ తాజా హెచ్చరికల తరువాతైనా మంత్రుల పనితీరులో వేగం పెరుగుతుందా? లేక ఈ క్లాస్ లు, హెచ్చరికలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.