ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆంధప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది మార్చి 31 తర్వాత తాజా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఎంసెట్, ఐసెట్, ఆన్లైన్ దరఖాస్తుల గడువు తేదీని పొడిగిస్తున్నట్టు మంత్రి తెలిపారు.













