రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్
ఎట్టకేలకు ఎన్డీఏ తన రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించింది. అమిత్ షా అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. అనంతరం అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థి పేరును ప్రకటించారు. బిహార్ గవర్నర్ రామనాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయన పేరును ప్రకటించినట్టు షా తెలిపారు.
ఈనెల 23న రామనాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దళిత నాయకుడైన రామనాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూరు సమీపంలోని డేరాపూర్. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్ గవర్నర్గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్నాథ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామనాథ్ కోవింద్ చాలా చురుగ్గా వ్యవహరించేవారు.













