“ఏపీ వలసదారుల’ (ఏపీఎన్నార్టీల) సంక్షేమం, అభివృద్ధి పాలసీ”
ఈ రోజు క్యాబినెట్ లో ఆమోదం పొందిన APNRT POLICY draft
ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 25 లక్షలమంది ప్రజలు ఉద్యోగం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు తరలివెళ్లారని గణంకాలు చెబుతున్నాయి. ఏపీకి చెందినవారు గల్ఫ్ దేశాల్లో 9 లక్షలమంది ఉంటే, 8 లక్షలమంది అమెరికాలో ఉన్నారని అంచనా వేస్తున్నారు. మిగిలినవారు యూరప్, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న ఏపీ తెలుగు ప్రజలు ఆయా దేశాల్లో స్థానిక భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
విదేశాల్లో ఈ ఏపీఎన్నార్టీలను (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) స్థానికులతో సమానంగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వం వీరికి అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగానే ఉంది. ఏపీ నుంచి విదేశాలకు వలస వెళ్లిన వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏపీఎన్నార్టీల నుంచి స్వరాష్ట్రానికి ఏటా వచ్చే రూ. 30 వేల కోట్ల చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొట్టమొదటిసారిగా ఏపీ వలసదారుల సంక్షేమం, అభివృద్ధి పాలసీ పేరుతో ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఏపీఎన్నార్టీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి ఇది పరిష్కారం చూపిస్తుంది. ఐవోఎం, ఐఎల్వో, యూఎన్ విమెన్ శాఖలతో కలిసి విజయవాడ, దుబాయ్ సమావేశాల్లో సభ్యులతో చర్చించి ఈ పాలసీని రూపొందించడం జరిగింది.
ఏపీఎన్నార్టీల సంక్షేమం, రక్షణ , పునరావాసం కోసం సమగ్ర ప్రణాళికను ఈ పాలసీ ద్వారా రూపొందిస్తారు. వలసదారుల ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వడం, అదనపు ఆదాయాన్ని ఆర్జించేలా శిక్షణ ఇవ్వడం ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ఈ పాలసీలో భాగంగా ఏపీఎన్నార్టీలలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్లో వారు పెట్టుబడులు పెట్టేందుకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతాయి.
“ఏపీ వలసదారుల సంక్షేమం, అభివృద్ది పాలసీలోని ముఖ్యాంశాలు”
వ్యూహాత్మక ప్రాధాన్యతలు:
కష్టపడి పనిచేయడం, కొలువులు, చదువుల కోసం దూర తీరాలకు సాగిపోయే మనస్తత్వం ఉన్న ఏపీ ప్రజలు, ప్రభుత్వ పాలసీలు ఎలా ఉన్నా వలస బాట పట్టి విదేశాలకు వెళుతూనే ఉన్నారు. ఈ వలస వెళ్లిన ప్రజల వల్ల రాష్ట్రానికి వస్తున్న ఆదాయం మాట ఎలా ఉన్నా వారి సంరక్షణ బాధ్యతలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దూరతీరాల్లో జరుగుతున్న ఘోరాలను దృష్టిలో ఉంచుకుని వారికి పొంచి ఉండే ప్రమాదాలను, అపాయాలను ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది.
పాలసీ కార్యక్రమాలు, అనుబంధ చర్యలు:
1. విదేశాలకు వలస వెళ్లే అవకాశం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని వలస కార్మికుల, ఉద్యోగుల వనరుల కేంద్రం ఏర్పాటు, ప్రి డిపార్చర్ కిట్స్తో పాటు శిక్షణ ఇవ్వడం, కార్మికులు, ఉద్యోగుల మధ్య ప్రభుత్వాలు వారధిగా ఉండే నియామక వ్యవస్థ ఏర్పాటు, వలసదారుల రక్షణబాధ్యతలు చేపట్టడం, నైపుణ్యాల అభివృద్ది కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయడం, ఉద్యోగ అవకాశాల గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి.
2. విదేశాలకు వలస వెళుతున్నవారి కోసం 24×7 పనిచేసే హెల్ప్లైన్ ఏర్పాటుచేయడం, భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వారిని అనుసంధానించడం, బీమా సౌకర్యం, ఆరోగ్య,న్యాయ సహాయం, విపత్కర పరిస్థితుల్లో ఇండియాకు తరలించడానికి నిధుల ఏర్పాటు వంటి మద్దతు చర్యలు తీసుకోవాలి.
3. స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టి, వారిని జనజీవనస్రవంతిలో కలపడానికి వలసదారుల ఆర్థిక పునరేకీకరణ కేంద్రం ఏర్పాటు, ట్రాన్సిషన్ ఫండ్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలి.
4. సురక్షిత పెట్టుబడి సాధనాలను ఏర్పాటుచేసి ప్రోత్సహించడం, వలసదారుల సమాచారంతో కేంద్రం ఏర్పాటు వంటివి చేపట్టాలి.
సంస్థాగత ఫ్రేమ్వర్క్:
1. ది ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీ) ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. ఇది 2016 మే నెల నుంచి పనిచేస్తోంది. దీనిలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి పరిపాలక, సేవలు, పెట్టుబడులు, స్మార్ట్ విలేజెస్ మరియు స్మార్ట్ వార్డుల విభాగాలు.
2. ఈ పాలసీకి సంబంధించి ఏపీఎన్నార్టీ అన్ని కార్యక్రమాలను అమలు చేసి అభివృద్దిని సమీక్షించే నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. వలసదారుల వనరుల కేంద్రాన్ని నిర్వహించి, ప్రోటోకాల్స్ను స్థిరీకరిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థలు, ఎన్జీవోలకు సహాయ సహకారాలు అందిస్తుంది.
వలసదారులు క్షేమంగా వెళ్లి లాభంగా ఉండేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ప్రి మైగ్రేషన్ కిట్స్ అందివ్వడం, సామాజిక-సాంస్కృతిక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, అత్యవసర సహాయ చెక్లిస్ట్ ఏర్పాటు, స్మార్ట్ఫోన్లపై అవగాహన పెంచడం, వలస సహాయక రుణ గ్యారంటీ, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, పోటీ తత్వం పెంచడం, ప్రమాదవశాత్తూ చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం వచ్చి ఉద్యోగం పోయినా కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈసీఆర్, నాన్ ఈసీఆర్ దేశాల్లో కూడా బీమా సౌకర్యం కల్పించే ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు.
ఈ పాలసీ ప్రకారం చేపట్టే కార్యక్రమాల అమలు కోసం కింద ఇచ్చిన 3 స్కీములను గల్ఫ్ దేశాల్లో ఉన్న బాధితుల కోసం ప్రపోజ్ చేయడం జరిగింది.
1. ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్(APNRT 24 x 7 Helpline)
2. ప్రవాసాంధ్ర భరోసా ( APNRT Insurance Scheme)
3. ప్రవాసాంధ్ర సహాయ నిధి (APNRT Emergency Relief Fund Scheme)
ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ (APNRT 24 x 7 Helpline)
1. బాధల్లో ఉన్న ఏపీఎన్నార్టీల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి సకాలంలో సాయం చేసేందుకు 24×7 హెల్ప్లైన్ ఏర్పాటుచేయడం ఈ స్కీము లక్ష్యం.
2. సింగిల్ విండో మెకానిజం ద్వారా తగిన సమన్వయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటుచేసుకునే కార్యక్రమంలో భాగంగా ఏపీలో 24×7 హెల్ప్లైన్ ఏర్పాటుచేసి దానిద్వారా వలసదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా సంస్థల దృష్టికి తీసుకువెళ్లాలి. దాని ద్వారా వారికి గైడెన్స్, కౌన్సెలింగ్ ఇప్పించాలి.
ప్రవాసాంధ్ర భరోసా (APNRT Insurance Scheme)
1. ఉద్యోగం లేదా ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసీఆర్, నాన్-ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లేవారికి బీమా సౌకర్యం కల్పించడం ఈ స్కీము లక్ష్యం.
2. ఏపీఎన్నార్టీ బీమా పథకంలో ప్రవాసీ భారతీయ బీమా యోజన స్కీములోని ఫీచర్స్ ని తీసుకోవడం జరిగింది. అయితే దానిలో లేనివిధంగా ఈసీఆర్, నాన్-ఈసీఆర్ ఈ రెండు రకాల దేశాలకు చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే ఏపీఎన్నార్టీలకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
3. ఈ బీమా స్కీములో ప్రమాదవశాత్తూ చనిపోయినా, అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షలు కవరేజి ఇస్తారు. ఆస్పత్రి ఖర్చుల కోసం అదనంగా రూ. 1 లక్ష చెల్లిస్తారు. న్యాయ సహాయ ఖర్చుల కోసం రూ. 45 వేలు చెల్లిస్తారు.
4. మూడేళ్ల కాలానికి సంబంధించి బీమా ప్రీమియం రూ. 375 దాకా ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 125.) దీనిలో ఏడాదికి రూ. 50చొప్పున మూడేళ్లకు రూ. 150 వలసదారు చెల్లించాల్సి ఉంటుంది.) మిగిలిన రూ. 225ను ఏడాదికి రూ. 75చొప్పున ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది.
వాసాంధ్ర సహాయ నిధి (APNRT Emergency Relief Fund)
1. అత్యవసర సహాయనిధిని ఏర్పాటుచేసి రాష్ట్రానికి తిరిగివచ్చిన బాధిత ఎన్నార్టీ వలసదారులను ఆదుకుని ఉపశమనం కలిగించడం ఈ స్కీము లక్ష్యం. అంతేకాకుండా ఇబ్బందుల్లో ఉన్న ఎన్నార్టీలకు వివిధ రకాల చర్యల ద్వారా రూ. లక్ష వరకు సాయం అందిస్తారు.
2. విపత్కర పరిస్థితుల్లో ఉన్న వలసదారులను ఆదుకోవడానికి ప్రస్తుతం స్వదేశంలో కానీ వారు ఉండే విదేశాల్లో కానీ ఎలాంటి సహాయ యంత్రాగం లేదు. విదేశాల్లో ఉండే వలసదారులు స్వదేశానికి తిరిగి రావాలన్నా ఒక్కోసారి వాళ్ల చేతుల్లో చిల్లిగవ్వ కూడా ఉండదు. డబ్బు లేకపోవడంతో జబ్బు చేసినా వైద్యం చేయించుకోలేని దుర్బర పరిస్థితుల్లో వాళ్లు ఉంటారు.
3. విదేశాల్లో ఉండే లేదా స్వదేశానికి తిరిగివచ్చే వలసదారులు విపత్కర పరిస్థితుల్లో ఉంటే వారి తక్షణావసరాలు తీర్చడానికి అత్యవసర నిధి ఏర్పాటు.













