విజయవాడ టూ ముంబైకి ఇండిగో సేవలు
విజయవాడ-ముంబై మధ్య విమాన సర్వీసులను వచ్చే నెల 12 నుంచి ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. గతంలో విజయవాడ నుంచి ముంబైకి వివిధ సంస్థలు నడుపుతున్న విమాన సర్వీసులు కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. అప్పటి నుంచి ముంబై వెళ్లాలనుకునే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించాలని విమానయాన సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. వారంలో మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముంబైలో ఉదయం 10:50కి బయలుదేరి మధ్యాహ్నం 12:25కి గన్నరవరం చేరుకుంటుంది. గన్నవరంలో మధ్యాహ్నం 1:30కి బయలుదేరి 3:20కి ముంబైకి చేరుకుంటుంది.













