వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట
భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన బెయిల్ కాల వ్యవధిని సుప్రీంకోర్టు తొలగించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే గ్రేటర్ ముంబయి దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు వరవరరావుకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్లో 2018 జనవరి 1న జరిగిన అల్లర్ల కేసులో వరవర రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ ఆరెస్ట్ చేసింది.













