సిఎంలకు పిఎం కాల్స్…లాక్డవున్ డేంజర్ బెల్స్?
సడన్గా ఆదివారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నట్లుండి పలువురు ముఖ్యమంత్రులకు ఫోన్ కాల్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు కూడా వున్నారు. అనుకోకుండా ప్రధాన మంత్రి నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికార వర్గాలు ఉలిక్కి పడ్డాయి. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధాన మంత్రి స్వయంగా, అప్రకటితంగా ఫోన్ కాల్ చేయడంతో పలువురు మళ్ళీ లాక్ డౌన్ వుంటుందా అన్న చర్చ మొదలైంది.
ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు ఫోన్ కాల్ చేశారు. తెలంగాణ, తమిళనాడు, బీహార్, అసోం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రదాన మంత్రి మాట్లాడారు. అప్రకటితంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కాల్ రావడంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తమయినట్లు సమాచారం. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకే ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తదుపరి కార్యాచారణకు సిద్దం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారని, అందుకే ముఖ్యమంత్రులతో ఆయన స్వయంగా మాట్లాడారని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి ఎలా ఉంది, కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలను మోదీ సిఎంల నుంచి వాకబు చేసినట్లు సమాచారం.
సోమవారం మరికొందరు ముఖ్యమంత్రులతో కూడా మోదీ మాట్లాడతారని ఆ తర్వాత కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తదుపరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. అది మరోసారి దేశవ్యాప్త లాక్డవున్ కావచ్చు అని కూడా పలువురు అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి లాక్ డవున్ పై ప్రధాని అంత సుమఖుంగా లేరని కాబట్టి ఇతరత్రా చర్యల గురించి మాత్రమే చర్చ సాగి ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సోమవారం సాయంత్రానికి సిఎంలతో పిఎం సంభాషణ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.













