ఇది ప్రతి భారతీయుడి ఆస్తి… ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో రైల్వేలకు నిధులు కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించొచ్చని అన్నారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి పథంలో పయనించగలదని చెప్పారు. రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోం. ఇది ప్రతి భారతీయుడి ఆస్తి… ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది. అయితే రైల్వేలో సేవలను మరింత మెరుగుపర్చడం కోసం ప్రైవేటు పెట్టుబడులను మేం స్వాగతిస్తాం అని గోయల్ వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే కేటాయింపులను ప్రభుత్వం భారీగా పెంచిందని ఆయన తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.1.5 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.2.15 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. రైలు ప్రయాణికుల భద్రతపై తాము గట్టిగా దృష్టిపెట్టామని అన్నారు. గత రెండేళ్లుగా ఒక్క రైలు ప్రయాణికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2019 మార్చి తర్వాత నుంచి రైలు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.













