జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. భారత్ తరపున కేంద్రమంత్రి పవిత్ర హాజరు..!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాతో చర్చలు జరుగుతుండడంతో.. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్న ఇరాన్ అధినాయకత్వం.. జులై 9వ తేదీన ఆయన అంత్యక్రియలు జరపాలని నిర్ణయించింది.జులై 4న టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా సముదాయంలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. చివరి అంత్యక్రియలు జులై 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్లోని ఇమామ్ రెజా దర్గా వద్ద జరగనున్నాయి.
అయితే ఈ అంత్యక్రియలకు ఇరాన్ తన మిత్రదేశాల ప్రతినిధులను ఆహ్వానించింది. భారత్ తరపున ప్రధాని మోడీని ఆహ్వానించినా.. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. మోడీకి బదులుగా బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా భారత ప్రతినిధులుగా పాల్గొననున్నారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల ప్రధాని మోడీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. అయితే ఆ సమయంలో ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటన ఖరారు కావడంతో మోడీ హాజరు కాలేకపోతున్నారు. ఈ షెడ్యూల్ ముందుగానే ఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. తొలుత మార్చిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు జులైలో పలువురు దేశాధినేతలు, ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.








