ఇద్దరు కాదు.. ముగ్గురు పిల్లలకు : చైనా గ్రీన్ సిగ్నల్

చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది. 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా దీనిని ముగ్గురికి పెంచడం గమనార్హం. చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.