ప్రయాణీకులూ… మరవద్దు జాగ్రత్తలూ…
-ప్రయాణాలపై సడలింపుల నేపధ్యంలో…-మార్గ దర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ 4.0లో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే ప్రయాణీకులంతా నిబంధనల మేరకు మాత్రమే విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దేశీయంగా ప్రయాణాలు చేసేవారు విదేశాల నుంచి వచ్చే వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. దీని ప్రకారం…
– ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెలర్స్, ఏజెన్సీలు టికెట్పైన ముద్రించాలి.
– స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఉండాలి.
– కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రకటించిన విధి,విధానాలను తప్పక పాటించాలి.
– రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలలో అధికారులు తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి.
– ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే.
– విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లలో ప్రయాణికుల పరస్పరం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
– విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లను తరచూ శానిటైజ్ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి.
– ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
-ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
-కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.
-తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్-19 చికిత్స కేంద్రాలకు, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్కు లేదా ఐసోలేటెడ్ కొవిడ్-19 వార్డుకు తరలించాలి. ఇది వారి ఎంపికను బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ ప్రామాణికాల ఆధారంగా దీనిని నిర్ణయించాలి.
-ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాతనే పంపించాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
విదేశీ ప్రయాణీకుల కోసం…
-ప్రయాణీకులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
-విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 14రోజులు క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో, ఆ తర్వాత మరో ఏడు రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి.
– తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిర్దేశిత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలి.
– ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
– రోడ్డు మార్గాన దేశంలోకి ప్రవేశించే ప్రయాణీకులు కూడా అన్ని ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించాల్సిందే. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే సరిహద్దు ద్వారా భారతదేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తారు.
– విమానంలో, ఓడలో వచ్చే వారు.. స్వీయ-డిక్లరేషన్ ఫారం నింపాలి. దాని ప్రతిని విమానాశ్రయం, ఓడరేవుల్లోని ఇన్యాడ్పోర్ట్ వద్ద ఉన్న ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.
– విమానాలు, విమానాశ్రయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
– బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించాలి.
– ప్రయాణ సమయంలో విధిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉండేలా హ్యాండ్ శానిటైజర్లు వాడాలి
– ఆరోగ్య, ఇమిగ్రేషన్ అధికారులు చేసే థర్మల్ స్క్రీనింగ్కు అందరూ సహకరించాలి.
– కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్కు తరలించడంతో పాటు, మిగిలిన విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ వసతిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించాలి.
– ప్రతి ప్రయాణికుడిని ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం పరీక్షించాలి.
– ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
– సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న కాలంలో, ఆ తరువాత అయినా.. ఏదైనా లక్షణాలు ఉంటే.. వారు జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్కు 1075 తెలియజేయాలి.






