ఏపీలో రికార్డు స్థాయిలో 8,147 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 8,147 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 80,858కి చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1029 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 933కి చేరింది.
తూర్పుగోదావరి జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, పశ్చిమగోదావరిలో 5, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 3, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,41,993 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్లో పేర్కొంది. ఇప్పటి వరకు 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, మరో 39,990 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.






