ఏపీలో 10,621 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,300 నమూనాలను పరీక్షించగా వారిలో 10,621 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 92 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమ గోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,633కి చేరింది. గత 24 గంటల్లో 8,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 34,79,990 నమూనాలను పరీక్షించారు.






