161 మంది భారతీయులు వెనక్కి…
అమెరికాలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో అందర్నీ ఇండియాకు పంపిస్తున్నారు. వారంతా పంజాబ్లోని అమృత్సర్ చేరుకోనున్నారు. డిపోర్ట్ అవుతున్న వారిలో 76 మంది హర్యానాకు చెందినవారు కాగా 56 మంది పంజాబ్, 12 మంది గుజరాత్, అయిదు మంది ఉత్తరప్రదేశ్, నలుగురు మహారాష్ట్రకు చెందినవారున్నారు. కేరళ, తెలంగాణ తమిళనాడుకు చెందిన ఇద్దరిద్దరు ఉన్నారు. ఆంధప్రదేశ్, గోవాలకు చెందినవారు ఒక్కరేసి ఉన్నారు.
అమెరికాలోని 95 జైళ్లలో సుమారు 1739 మంది భారతీయులు బంధీలుగా ఉన్నట్లు నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నం సింగ్ చావాల్ పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 2018లో ఆ సంఖ్య రెండున్నర రెట్లు ఎక్కువైంది. డిపోర్ట్ చేస్తున్న 161 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. దీంట్లో హర్యానాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి ఉన్నది. అమెరికాలో అక్రమంగా చొరబడిన వారిలో ఎక్కువ శాతం మంది ఉత్తర భారత దేశానికి చెందినవారున్నారు.













