బోస్టన్లో ఘనంగా దసరా-దీపావళి వేడుకలు
బోస్టన్లో దసరా, దీపావళి వేడుకలను అక్టోబర్ 28వ తేదీన వైభవంగా జరుపుకున్నారు. గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (టిఎజిబి) ఆధ్వర్యంలో న్యూహాంప్షైర్లోని నషువా హైస్కూల్లో జరిగిన జరిగిన దసరా దీపావళి వేడుకలకు 900 లకు పైగా సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. కార్యవర్గ సభ్యులు కూడా ప్రేక్షకులకి ఆహ్లాదరకమైన కార్యక్రమాలను అందించి అలరించారు. కార్యక్రమ ప్రాంగణాన్ని … అలంకరణ బృందం, సంప్రదాయ ఉత్సవ ఆకృతిలో పాఠశాల ప్రవేశద్వారం మరియు వేదికను అలంకరించి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.
వేడుకలు డా|| మేకా శేషగిరి రావు జ్యోతి ప్రజ్వలన చేసి, అమెరికా జాతీయ గీతం పాడిన పిదప అధ్యక్షులు శ్రీనివాస్ బచ్చు స్వాగత పలుకుల తో ప్రారంభమయ్యాయి. సంప్రదాయ బద్దంగా మహిళా సభ్యులు బతుకమ్మ ఆడడంతో ప్రారంభమై, చిన్నారులు, ఆలపించిన ఆధ్యాత్మిక గానామృతములతో, శ్లోకములు, డాన్సు మెడ్లీ సందడులతో, శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, హాయిగా కడుపుబ్బా నవ్వించిన నాటకాలతో ముందుకు సాగుతూ 8 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 40కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజపరిచారు.
కార్యవర్గ సభ్యులు శ్రీమతి మణిమలా చలుపాది, సీతారం అమరవాది, ప్రదీప్ పెనుబోలు, రామకృష్ణ పెనుమర్తి, శ్రీమతి సత్య పరకాల, శ్రీమతి దీప్తి గోరా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి అంటే వాటి వెనుక ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు గురువులు, స్వచ్ఛంద సేవకులు కమిటీ సభ్యులు ఎన్నో గంటలపాటు ఇందుకోసం శ్రమించారు.
వివిధ కళలను ప్రదర్శించిన వారికి, చదరంగ పోటీ లో గెలిచిన వారికి, ర్యాఫిల్ బహుమతి గెలిచినవారికి కమిటీ సభ్యులు ప్రత్యేకాభినందలు తెలియ జేసారు. నాటి సాయంత్రం శ్రీమతి రూబీ బొయినపల్లి చేత తయారు చేసిన బుట్ట బొమ్మలు, వాటి తో పిల్లల చేత ప్రదర్శించిన రామాయణం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభికులు అందరూ నిలిచి జయధ్యానాలతో తమ హర్షాన్ని ప్రకటించారు.
శ్రీమతి శైలజా చౌదరి గారి శిష్యులు ప్రదర్శించిన దశావతారముల నృత్యము, దీపావళి నృత్య రూపకం నరకాసురవధ దసరా దీపావళి సంబరాలకి ప్రాతినిధ్యం గా నిలిచి నాటి కార్యక్రమాలకి వన్నె తెచ్చాయి. నాటి సాయంత్రం ప్రదర్శనలతో పాట ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ప్యారడైస్ బిర్యాని రెస్టారెంట్, ఉడిపి రెస్టారెంట్ ఆధ్వర్యంలో విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమై భోజనం అందించారు.
ప్రత్యేక అతిధిగా విచ్చేసిన జొన్న విత్తుల గారి కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. వారి తో ఇష్టా గోష్టిలో సభికులు తెలుగు భాషగురించి అడిగిన ప్రశ్నలకు వారు ఎంతో ఓపిక తో తమదైన శైలితో సంశయాలు తీర్చారు. ఆయన అధిక్షేప కవితా బాణి, అస్తవ్యస్త వ్యవస్థకు చికిత్స. ఆయన ప్రవచనాలు భక్తి భావనా సోపానాల. విషయం ఏదైనా దానిని హాస్య వ్యంగ్య చమత్కార చాతురితో వివరించినతీరు, ఆహుతులకి మానసిక ఉల్లాసాన్ని ఆలోచనామృతాన్ని అందించాయి. మోహన్ నన్నపనేని, శశికాంత్ పల్లి గారు జోన్నవిత్తుల రామలింగేశ్వర రావును ఘనంగా సత్కరించారు.
ఎంతో కృషిని, సమయాన్ని వెచ్చించి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్శకులకు, వారి తల్లిదండ్రులకు విచ్చేసిన ప్రేక్షకులకు, వాలంటీర్లకు కార్యవర్గ సభ్యులకు, మరియు దాతలకు, ప్రెసిడెంట్ శ్రీనివాస్ బచ్చు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి విజయ్ పంచాక్షరి, శ్రీమతి లత పంచాక్షరి, రవికాంత్ బచ్చు, శ్రీమతి మహతి మొదలి, మనోజ్ ఇరువూరి, శ్రీమతి కిరణ్మై చతుర్వేదుల, రమేష్ దడిగల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. యువ వ్యాఖ్యాతలైన సాయి వల్లూరి , మరియు స్మేరా గోరా తమ చక్కని తెలుగు వాక్చాతుర్యంతో వచ్చిన ప్రేక్షకుల మనస్సులు దోచుకున్నారు. చివరిగా సెక్రటరీ శ్రీ ప్రదీప్ పెనుబోలు ప్రదర్శకులకు, వాలంటీరులకు, దాతలకు, అలాగే స్కూల్ యాజమాన్యానికి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత జాతీయ గీతం పాడటంతో నాటి దసరా -దీపావళి వేడుకలు విజయవంతంగా ముగిసాయి.













