ముస్లింలపై ప్రభావం పడొచ్చు : అమెరికా
భారత్ తీసుకువస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తి కనబరుస్తోంది. అమెరికా కాంగ్రెస్కు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అనే స్వతంత్ర సంస్థ భారత పౌరసత్వ సవరణ చట్టంపై ఓ నివేదిక రూపొందించి అమెరికా కాంగ్రెస్ సభ్యులకు అందించింది. ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 1955 నాటి నుంచి ఈ చట్టానికి పలు సవరణలు చేశారని, అయితే ఈ మార్పులు మతప్రాదికగా జరగలేదని సీఆర్ఎస్ పేర్కొంది. ప్రస్తుతం సీఏఏని జాతీయ పౌర పట్టి (ఎన్నార్సీ)తో కలిపి తీసుకురావడం వల్ల భారత్ లోని ముస్లింలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని, తద్వారా భారత్లో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నట్టయిందని వివరించింది. అంతేకాదు సీఆర్ఎస్ భారత రాజ్యాంగం చట్టాన్ని పరిశీలించింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15లను దిక్కరించేలా ఉందన్న అభిప్రాయం వెలువరించింది. ఈ చట్టంపై ప్రభుత్వ వాదనలను తన నివేదికలో పొందుపరిచి సీఆర్ఎస్, దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను కూడా ప్రస్తావించింది.













