‘వర్క్ ఫ్రం హోం’.. ఏడాది చివరి వరకూ
కరోనా మహమ్మారి కట్టడికి వర్క్ ఫ్రం హోం పద్ధతిని కొనసాగించాలని పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంతర్జాతీయంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ తమ ఉద్యోగులలో చాలామంది ఇంటి నుంచే పని చేయడానికి అనుమతిస్తామని ప్రముఖ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ తెలిపాయి. జులై 6 వరకు చాలా వరకు తమ కంపెనీ కార్యాలయాలను తెరిచే ఆలోచనలేదని ఫేస్బుక్ స్పష్టం చేసింది. పబ్లిక్ హెల్త్ డేటా, ప్రభుత్వ మార్గదర్శకాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆఫీసులను ఓపెన్ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఏడాది (2020) చివరి వరకూ ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎంప్లాయిస్తో మీటింగ్లో ధ్రువీకరించారు. గూగుల్ మొదట జూన్ 1 వరకూ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు దానిని మరో ఏడు నెలలు పొడిగించింది.













