ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె
పెప్సికో నుంచి త్వరలో నిష్క్రమిస్తున్న ఇంద్రానూయి, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్వవస్థ తీరు తెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్ నూయితో కలిసి ఇంద్రానూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్ బంగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న 15 మంది దిగ్గజాల్లో ఫియట్ క్రిస్లర్ సీఈవో మైఖేల్ మాన్లీ, ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ స్మిత్ తదితరులున్నారు.
నా ప్రభుత్వ విధానాలతో అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో మీవి కూడా ఉన్నాయి. అలాగే పలు కేసుల్లో మీ సహకారం ఎంతగానో ఉపయోగపడింది. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకు మీ సహాయ, సహకారాలు కావాలి. కొత్త వాణిజ్య ఒప్పందాలతో రాబోయే రోజుల్లో అమెరికా వృద్ధి రేటు అయిదు శాతం స్థాయికి చేరే అవకాశాలున్నాయని అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఇంద్రా నూయిని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.













