“ఆధునిక తరానికి ధర్మం దిక్సూచి కావాలి – సాయి కృష్ణ అవునూరి”
ఎడిసన్ శ్రీ శివ విష్ణు టెంపుల్లో విజయవంతంగా “ధర్మ ఫర్ మోడర్న్ మైండ్స్” కార్యక్రమం
ఎడిసన్, న్యూజెర్సీ – సెప్టెంబర్ 10, 2026:
న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉన్న *సాయి దత్త పీఠం – శ్రీ శివ విష్ణు టెంపుల్ & కల్చరల్ సెంటర్* ఆధ్వర్యంలో నిర్వహించిన “*ధర్మ ఫర్ మోడర్న్ మైండ్స్* ప్రత్యేక కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి *నేషనలిస్ట్ హబ్ వ్యవస్థాపకుడు శ్రీ సాయి కృష్ణ అవునూరి* ముఖ్య వక్తగా హాజరై, ఆధునిక జీవన విధానంలో ధర్మ ప్రాముఖ్యతపై ఆలోచనాత్మకంగా ప్రసంగించారు.
ప్రత్యేకంగా Gen Z, Gen Alpha యువతరం, తల్లిదండ్రులు, కుటుంబాలు మరియు కమ్యూనిటీ సభ్యులను దృష్టిలో ఉంచుకుని, నేటి కాలంలో ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరణలో పెట్టాలి అనే అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియా ప్రభావం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సహచరుల ఒత్తిడి, కెరీర్ పోటీ, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ విలువలు, తరాల మధ్య భావ భేదాలు వంటి సమకాలీన అంశాల నేపథ్యంలో ధార్మిక విలువలు మనకు ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయో ఆయన వివరించారు.
ధర్మాన్ని కేవలం మతపరమైన భావనగా కాకుండా, రోజువారీ నిర్ణయాలు, బాధ్యత, నైతికత, క్రమశిక్షణ, కుటుంబ బంధాలు, వ్యక్తిత్వ వికాసం మరియు సమాజ పట్ల బాధ్యతతో ముడిపడి ఉన్న జీవన విధానంగా చూడాలని శ్రీ సాయి కృష్ణ అవునూరి సూచించారు.
కార్యక్రమంలో నిర్వహించిన ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తర సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత, తల్లిదండ్రులు నేరుగా పాల్గొని పలు ప్రాసంగిక ప్రశ్నలు అడిగారు. వ్యక్తిగత స్వేచ్ఛకు పరిమితులు ఏమిటి, తల్లిదండ్రుల అభిప్రాయాలతో విభేదించినప్పుడు ఎలా వ్యవహరించాలి, సంప్రదాయాలను అర్థం చేసుకుని అనుసరించడం ఎలా, సోషల్ మీడియా ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి, AI యుగంలో మానవ విలువల ప్రాధాన్యత ఏమిటి, విజయం అంటే ఏమిటి వంటి అంశాలపై చర్చ జరిగింది.
యువత కేవలం సంప్రదాయాలను అనుసరించడం కాకుండా, వాటి వెనుక ఉన్న భావాన్ని తెలుసుకుని, ప్రశ్నించి, అర్థం చేసుకుని, జీవితంలో ఆచరణలో పెట్టాలని ఆయన ప్రోత్సహించారు. సరైనది తెలిసినా దాన్ని ఆచరించడం కష్టమైన సందర్భాల్లో అంతర్గత ధైర్యం, వివేకం, విలువలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు స్థానిక, జాతీయ తెలుగు సంఘాల ప్రజాప్రతినిధులు, ఆలయ కార్యనిర్వాహక సభ్యులు, ఆలయ చైర్మన్ రఘశర్మ శంకరమంచి ని, ఇలాంటి చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం, ఆలయ మర్యాదలతో, మంత్రోచ్ఛారణల మధ్య సాయికృష్ణ అవునూరికి చిరు సత్కారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యసహాయకులుగా వ్యవహరించిన విలాస్ జంబుల, కృష్ణ రెడ్డి అనుగుల, మురళి మేడిచర్ల, దాము గేదల, మధు అన్న, సుభద్ర, ఉపేంద్ర చివుకుల, రమేష్ అవునూరి ఇంకా పలువురు కి ధన్యవాదములు తెలియజేశారు.










