పాలిస్తే మధుమేహం ముప్పు తగ్గుతుంది!
తల్లి పాలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది, జీర్ణకోశ వ్యాధులు, మలబద్దక సమస్యలు, ఆస్తమా లాంటివి రావు. అయితే, తల్లిపాలు తాగితే కేవలం పిల్లలకే కాదు తల్లులకూ ఆరోగ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పిల్లలకు ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ రోజులు పాలిస్తే మహిళల్లో టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందట. పాలివ్వని, పాలిచ్చే మహిళలను పోల్చి చూడగా పాలిచ్చే వారిలో వ్యాధి వచ్చే ప్రమాదం 47 శాతం తగ్గుతుందని అమెరికాలోని హెల్త్ కేర్ కంపెనీ కైసర్ పర్మనెంట్ నిపుణులు తెలిపారు. 1971 నుంచి 2000 వరకు 30 ఏళ్ల పాటు 18-30 ఏళ్ల వయసున్న 5వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని వివరించారు. మధుమేహం ఒక్కటే కాదు, రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.













