Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ఛైర్మన్ సంజయ్కిషోర్ నిర్వహణలో హైదరాబాద్ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ- మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ– సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథమని, సినీ రంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రిగారే అని కొనియాడారు.
నటులు, నిర్మాత మురళీమోహన్, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్, రచయిత సంజయ్కిషోర్, ప్రచురణ కర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి గారి పాటల పల్లవులను ఆలపించారు.అనంతరం సావిత్రి గారిపై రూపొందించిన అవార్డు గ్రహీతల డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంజయ్ కిషోర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.






