సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ను సందర్శించారు. ట్యాంక్ బండ్పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్యలు చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను కలిసి సోనూ సూద్ అభినందించారు. ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన నగదుతో శివ ఇటీవల ఓ అంబులెన్స్ను కొనుగోలు చేసి సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ అని పేరు పెట్టాడు. ఈ వాహన ప్రారంభోత్సవానికి రియల్ హీరో సోనూసూద్ను ఆహ్వానించాలని నిర్ణయించాడు. శివ కోరిక మేరకు హైదారబాద్కు విచ్చేసిన సోసూసూద్ ట్యాంక్బండ్ వద్దకు వెళ్లాడు. అక్కడున్న అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.
ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో శివ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సోనూసూద్ ప్రశంసించారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న శివను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిస్వార్థం, అంకితభావంతో ప్రజలకు సేవలందించే శివ లాంటి వ్యక్తులు అనేక మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సోనూసూద్ అభిప్రాయపడ్డారు. అనంతరం శివ మాట్లాడుతూ విపత్కర సమయంలో సేవలందించిన తన పట్ల ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు వివిధ రూపాల్లో తనకు అందించిన డబ్బుతో అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు శివ తెలిపారు.













