బాలకృష్ణ, బోయపాటితో భారీ సినిమా చేస్తున్న నిర్మాత కు నాన్ బెయిలబుల్ వారెంట్?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ల సక్సెస్ఫుల్ కాంబోలో BB3 అనే ప్రతిష్టాత్మక సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఏడేళ్ల క్రిందటి వివాదం ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ఊహించని విధంగా కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడేళ్ల క్రింద గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా సమయంలో జరిపిన ఆర్ధిక వివాదం కారణంగా రవీందర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సినిమా రిలీజ్ అయిన సమయంలోనే రవీందర్ రెడ్డిపై ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ చీటింగ్ కేసు పెట్టారు.
తన నుంచి సాహసం శ్వాసగా సాగిపో సినిమా నిమిత్తం యాభై లక్షలు అడ్వాన్స్గా తీసుకున్న రవీందర్ రెడ్డి ఆ అగ్రిమెంట్ని పక్కన పెట్టి వేరే డిస్ట్రిబ్యూటర్ కి రైట్స్ అమ్మేశారని, ఆ తర్వాత ఆ డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని, అందువల్ల తాను నష్టపోయానని సదరు డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. దీంతో కొన్నేళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంతరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రవీందర్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇదిలాఉంటే ప్రస్తుతం మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న BB3 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలకృష్ణ డిఫరెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాపై బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ఫైనల్ చేశారని టాక్. ఈ సినిమాను మహానటుడు యన్టీర్ పుట్టిన రోజు మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.













