Producers: డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా..
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ తెలుగు నిర్మాతల నుంచి వారానికి పది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా రిలీజ్ కు కనీసం పది లక్షల రూపాయలు నిర్మాతలు భారాన్ని మోయాల్సివస్తోంది. మల్టీప్లెక్స్ లో అయితే వారానికి 15 వేల రూపాయలు నిర్మాత చెల్లించాలి. ఇదే పక్క రాష్ట్రాల్లో 2500 నుంచి 3 వేల రూపాయల మాత్రమే ఛార్జీలు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఇంత అధిక ధరలు ఎందుకు చెల్లించాలి. ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్టనర్స్ గా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమను లూటీ చేస్తున్నారు. థియేటర్స్ వాళ్ల కంట్రోల్ లోనే ఉన్నాయి. థియేటర్స్ లో వందల రూపాయలు తినుబండారాలకే ఖర్చువుతోంది. టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్ లో చూసేందుకు రావడం లేదు. ఏడాదిలో రిలీజయ్యే 250 చిత్రాల్లో 200 చిన్న చిత్రాలే ఉంటున్నాయి. అలాంటి చిన్న సినిమా ఈ రోజున బతికే పరిస్థితి లేదు. నేను నిర్మాతగా దాదాపు 50 సినిమాలు నిర్మించా. అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. టీఎఫ్ సీసీ తరుపున మా పోరాటం కొనసాగిస్తాం. సదరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఇంటి ముందు ధర్నాలు చేస్తాం. పైరసీ అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు అభినందనీయం అన్నారు.
నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ మాఫియాలా తయారయ్యారు. ఇక్కడి ప్రొడ్యూసర్స్ కొందరు ఆ కంపెనీలతో కుమ్మక్కై చిన్న నిర్మాతలను దోపిడీ చేస్తున్నారు. నేను జయహో రామానుజా అనే సినిమాను నిర్మించి రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నాను. 400 థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయాలంటే 50 లక్షల రూపాయలు ఈ కంటెంట్ ప్రొవైడర్స్ కే పెట్టాల్సివస్తోంది. ఇక చిన్న నిర్మాత బతికే పరిస్థితి ఎక్కడుంది. సామాన్యుడు థియేటర్ కు వెళ్లాలంటే 2, 3 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. టికెట్ రేట్స్ పెంచారు. ఇవన్నీ చూసి చిన్న సినిమాకు రావాల్సిన ప్రేక్షకుడు కూడా రావడం లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా అన్నారు.
నిర్మాత డి ఎస్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమా బ్రతకాలంటే డిజిటల్ చార్జీలు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లు, టికెట్ చార్జీలు తగ్గించాలి అన్నారు.
నిర్మాత ఎ గురురాజ్ మాట్లాడుతూ – నేను ముమైత్ ఖాత్ తో మంగతాయారు టిఫిన్ సెంటర్ అనే సినిమా చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చారు. అలాంటిది ఇటీవల నేను కోట్లాది రూపాయలతో కొన్ని సినిమాలు నిర్మిస్తే రూపాయి తిరిగి రాలేదు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఉన్నారు. చిన్న నిర్మాతలు అనేక రకాల దోపిడీలకు గురవుతున్నారు. కంటెంట్ ప్రొవైడర్స్ రేట్స్, టికెట్ రేట్స్, తినుబండారాల రేట్స్ తగ్గించాలి. లేకుంటే ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కపెట్టే ఆ కొద్ది మంది నిర్మాతలు మాత్రమే ఉంటారు. చిన్న నిర్మాతలెవరూ ఉండరు. ఏడాదిలో నెలకో సినిమా కూడా రిలీజ్ కాదు. థియేటర్స్ మూసుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యలపై పోరాడుతున్న నా తోటి టీఎఫ్ సీసీ నాయకులకు నా అభినందనలు అన్నారు.
నటుడు, దర్శకుడు సిరాజ్ మాట్లాడుతూ – చిన్న సినిమాకు థియేటర్స్ దొరకడం లేదు. ఓటీటీ, శాటిలైట్ వాళ్లు తీసుకోవడం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చే ఊరి బయటి థియేటర్స్ కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపరు. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ వో తమ రేట్స్ ను తగ్గించాలి. లేకుంటే ఈ ధర్నాలు ఆగవు. కొనసాగిస్తూనే ఉంటాం అన్నారు.






