క్వీన్2 రిలీజ్కు లీగల్ షాక్!
కంగనా రనౌత్(Kangana Ranaut) నటించిన సూపర్హిట్ మూవీ క్వీన్(Queen)కు సీక్వెల్గా రూపొందుతున్న క్వీన్2(Queen2) ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. డైరక్టర్ వికాస్(Vikas bahl) తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ దిశగా వేగంగా సాగుతుండగా, ఇప్పుడు అనూహ్యంగా లీగల్ వివాదంలో చిక్కుకుంది. తాజా పరిణామాలతో సినిమా భవితవ్యంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కోర్టు కేసు కారణంగా రిలీజ్ ప్లానింగ్స్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఫాంటమ్ స్టూడియోస్(Phantom studios) బాంబే హైకోర్టును ఆశ్రయిస్తూ జియోస్టార్(Jiostar)పై రూ.250 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది. క్వీన్ సినిమాకు సంబంధించిన మేధోసంపత్తి హక్కుల్లో తమకు 50% వాటా ఉందని, ఆ హక్కుల పరిధిలో సీక్వెల్ రూపొందించాలంటే తమ అనుమతి తప్పనిసరిగా అవసరమని సంస్థ వాదిస్తోంది. తమ సమ్మతి లేకుండానే క్వీన్2 నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తోంది. కోర్టును ఆశ్రయించే ముందు పబ్లిక్ నోటీస్ జారీ చేయడంతో పాటు పలుమార్లు డిస్కషన్స్ జరిపినా సమస్యకు పరిష్కారం దొరకలేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ ఆరోపణలపై జియోస్టార్ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో కేసు విచారణ ఎలా సాగుతుంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలపై పరిశ్రమ దృష్టి నిలిచింది. షూటింగ్ పూర్తైన నేపథ్యంలో ఈ న్యాయపరమైన వివాదం సినిమా రిలీజ్ డేట్ పై ప్రభావం చూపుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం క్వీన్2కు సంబంధించిన ప్రతి పరిణామం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.








