Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 (Hari Hara Veera Mallu Part1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (Producer AM Rathnam )సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ గీతం విడుదలైంది.
‘హరి హర వీర మల్లు’ నుంచి రెండవ గీతంగా విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ పాట అద్భుతంగా ఉంది. ఈ గీతం సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళింది. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు.. ఎంతో వినసొంపుగా, శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. తెరపై ఈ జోడి చూడముచ్చటగా ఉంది. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ‘కొల్లగొట్టినాదిరో’ గీతం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. బహుళ భాషల్లో విడుదలైన ఈ గీతాన్ని ప్రతిభగల గాయనీ గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ ఆలపించి పాటకు మరింత మాధుర్యం తీసుకొచ్చారు.
కీరవాణి యొక్క అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘హరి హర వీరమల్లు’ చిత్రానికి చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.













