Bollywood: బాలీవుడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025

బాలీవుడ్ (Bollywood) లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్లోని అహ్మదాబాద్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరుకాగా.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్లుగా వ్యవహారించి అభిమానుల్లో జోష్ నింపారు. 2024 విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించగా.. లాపతా లేడీస్, చందు ఛాంపియన్, కిల్ చిత్రాలు సత్తా చాటాయి. దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు (కిరణ్ రావు), ఉత్తమ సహాయ నటుడు (రవి కిషన్), ఉత్తమ సహాయ నటి (ఛాయా కదమ్) సహా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు.
‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ‘జిగ్రా’ చిత్రంలో అద్భుత నటనకు గాను ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును ‘శ్రీకాంత్’ చిత్రానికి రాజ్కుమార్ రావు గెలుచుకోగా, ‘లాపతా లేడీస్’ చిత్రానికి ప్రతిభా రాంటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బాలీవుడ్కు చేసిన విశేష సేవలకు గాను సీనియర్ నటి జీనత్ అమన్ మరియు దర్శకుడు శ్యామ్ బెనెగల్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించబడ్డారు. ‘లాపతా లేడీస్’ చిత్రంలోని పాటను ఆలపించినందుకు గాను అరిజిత్ సింగ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఫిల్మ్ఫేర్లో అత్యధికంగా 8 ఉత్తమ సింగర్ అవార్డులు గెలుచుకున్న కిషోర్ కుమార్తో సమానంగా నిలిచి అరిజిత్ సింగ్ రికార్డు సృష్టించారు.
తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి’ అని పంచుకున్నారు.