అను కోరిక తీర్చిన అల్లు
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా షూటింగ్ పూర్తికావడంతో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంచి యూనిట్తో పనిచేశానని ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కోరిక గురించి చెప్పారు. అను నన్ను అడిగిన మొదటిది, చివరి కోరిక ఓ సెల్ఫీ. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమెతో దిగిన మొదటి సెల్ఫీ ఇదేనంటూ ఫోటోని షేర్ చేశారు బన్నీ. ఈ సినిమా పాటల వేడుక ఈ నెల 22న మిలట్రీ మాధవరంలో జరగనుంది.













