వలస కార్మికుల సంక్షేమ నిధికి పొన్నాల లక్ష్మయ్య రూ. 5లక్షలు విరాళం
వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ పీసీసీకి విరాళాలు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించేందుకు పార్టీ అధ్వర్యంలో రవాణా సౌకర్యం కల్పించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలు విరాళాలు ఇస్తునారు. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీ సీనియర్ నేత, టీ పీసీసీ వలస కూలీల కమిటి చైర్మన్ వి.హనుమంతరావుకు రూ. 5,00,121 ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ వలస కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. విపత్తు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు మానవతా దృక్పధంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని చూస్తారన్నారు.






