మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

నీది మేనేజ్ మెంట్ సీటంటే నీది పేమెంట్ కోటా..ఇప్పుడు తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. తండ్రిపేరు చెప్పుకుని బతకడం కాదని.. దమ్ముంటే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటైనా గెల్చి చూపించాలని కేటీఆర్కు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పనైపోయిందని, ఇక ఆపార్టీ రేసులో లేనట్లే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కేటీఆర్ అంతే ఘాటుగా బదులిచ్చారు.మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం’’ అని ప్రతి సవాల్ విసిరారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు. మాది మేనేజ్మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకా గాంధీది ఏం కోటా? రేవంత్ది పేమెంట్ కోటానా? అలా సీటు తెచ్చుకున్నందుకు రేవంత్.. ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బ్యాగులు మోయాలి.
ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారన్నారు కేటీఆర్. పదేపదే తానే సీఎం అని రేవంత్ చెబుతున్నారన్న కేటీఆర్.. ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి అని సూచించారు.