ఆ ఇద్దరంటే కేసీఆర్ కు లెక్క లేదా…?
ఏమాటకామాట తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. 2014 తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడం గానీ కార్యకర్తలతో నేతలతో మాట్లాడటం గానీ ఎక్కడా చేయలేదు అనే చెప్పాలి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బకు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ వైఖరి లో మాత్రం పెద్దగా మార్పు కనపడటం లేదు అనేది చెప్పవచ్చు. పార్టీ లో చాలామంది సీనియర్ నేతలు అసహనంగా ఉన్నారని తెలిసింది.
అయినా సీఎం కేసీఆర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది క్షేత్రస్థాయి నేతల్లో పార్టీ మీద చాలా అభిప్రాయాలున్నాయి. సీఎం కేసీఆర్ కు వాస్తవాలు వివరించాలని ప్రయత్నం చేసినా సరే పెద్దగా ఫలితం కనపడలేదు. మంత్రి కేటీఆర్ కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక మంత్రి హరీష్ రావు విషయానికొస్తే ఆయన కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయడం లేదు.
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు ముందు వరుసలో ఉన్నారు. కానీ వీళ్ళ అభిప్రాయాలను కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలుసుకునే ప్రయత్నం చేయటంలేదు. నామ నాగేశ్వరరావు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సరే తుమ్మల నాగేశ్వరరావు గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. అలాగే ఆయనతో పాటుగా వైసీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు.
టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై వీరు ఇద్దరూ అసహనం గానే ఉన్నారు. వాళ్ళకు పదవులు రాకపోగా పార్టీలో వాళ్ళను పక్కన పెట్టడం పై తీవ్రస్థాయిలో అసహనం ఉంది అని చెప్పాలి. ప్రత్యక్ష ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన తర్వాత పార్టీకి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీటు ఖరారు చేయలేదు. దీంతో ఆయన కూడా అసహనంగా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభ వస్తుందని ఎమ్మెల్సీ వస్తుంది అని ప్రచారం జరిగినా సరే అలాంటి పరిస్థితి కనబడలేదు.
ఇప్పుడు వాళ్లు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చినా సరే సీఎం కేసీఆర్ కనీసం వాళ్ళిద్దర్నీ ప్రగతి భవన్ కు పలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో కార్యకర్తలలో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. వాళ్ళిద్దరికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి క్యాడర్ ఉంది. తుమ్మల నాగేశ్వరరావుకి నల్గొండ జిల్లాలో కూడా అభిమానులు ఉన్నారు.













