మంత్రి కేటీఆర్ కు అపూర్వ గౌరవం
దావోస్ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్కు అపూర్వమైన గౌరవం దక్కింది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా పలు దేశాల ఉప ప్రధానులు, మంత్రులు పాల్గొన్న లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్ వాల్యూ టు సొసైటీ అన్న అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్యానెలిస్టులంతా ఆయా దేశాల కేంద్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యవ వహించగా, మంత్రి కేటీఆర్ ఒక్కరికే ఒక రాష్ట్ర మంత్రిగా ఇందులో పాల్గొనే అవకాశం దక్కడం గమనార్హం. మంత్రి తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమం గురించి వివరించారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథతోపాటు ప్రతి ఇంటికీ ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్ సౌకర్యం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా కల్పిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేస్తున్నామన్నారు. అట్లాగే డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్నార్, ఇండోనేషియా, నైజిరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతార్, పాకిస్తాన్ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













