నాగార్జునకు హైకోర్టులో ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపండి

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం పలు విషయాలను పేర్కొంది. అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట. అప్పటి సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. 2010-12 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయింది. అయితే, ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన భూమి మీద మరో మూడు, నాలుగు సర్వే రిపోర్టులు సర్క్యులేషన్లో ఉన్నాయి.
దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై కోర్టుని ఆశ్రయించారు. రూ.9 కోట్లు డిపాజిట్గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని అంగీకరించారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా, దానిని బేఖాతరు చేస్తూ ఈనాటి ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టింది అని పిటిషన్లో వెల్లడించారు.