కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట : కేటీఆర్
సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. మేం ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తున్నారు. ఆడిట్ లెక్కలు తీస్తున్నారు. లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారని ఇక కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారు. అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కేటీఆర్ అన్నారు.













