చదువుకుంటూనే ఉపాధి.. ఐటీఐ, ఏటీసీ కోర్సులతో కెరీర్కు భరోసా
ITI: ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, చదువుకునే దశలోనే స్థానికంగా ఉపాధి మార్గాలను చూపే సంస్థలుగా ‘ఐటీఐ’ (ITI) , ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్’ (ATC) నిలుస్తున్నాయి. కరోనా ప్రభావం , ఆర్థిక కారణాలతో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడినప్పటికీ, మల్లెపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) వంటి సంస్థలు వృత్తి విద్యా నైపుణ్యాలను అందిస్తూ విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 గడువు ..
ఈ విద్యా సంవత్సరానికి ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 వరకు గడువు ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే, ఎనిమిదో తరగతి పాసైన వారి కోసం కూడా వెల్డింగ్, కార్పెంటర్, షీట్ మెటల్, కుట్టుపని వంటి ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
నేరుగా ఉపాధి అవకాశాలు..
ఉపాధి శిక్షణ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు (ఆర్డీడీ) బి. సీతారాములు తెలిపిన వివరాల ప్రకారం, ఐటీఐ , ఏటీసీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా జాబ్ మేళాలు , అప్రెంటిస్షిప్ కార్యక్రమాల ద్వారా ప్రముఖ సంస్థల్లో నేరుగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. మార్కెట్ , పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు, ఇందులో అమ్మాయిల కోసం ప్రత్యేక కోర్సులు కూడా ఉన్నాయి. నగరంలో మొత్తం ఎనిమిది ఐటీఐ, ఏటీసీ కేంద్రాలు ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారు సొంతంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి ఇతరులకు కూడా ఉపాధిని కల్పిస్తున్నారు.
రూ.10 కోట్లతో ఆధునీకరణ..
మల్లెపల్లి ప్రభుత్వ మోడల్ ఐటీఐ, ఏటీసీ కేంద్రం ప్రిన్సిపాల్ పి. రాధాకృష్ణ మాట్లాడుతూ, సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఆధునిక వసతులతో అప్గ్రేడ్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూపుదిద్దుకున్న ఈ సంస్థలో ప్రతి సంవత్సరం 500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్మెన్ సివిల్, మోటారు మెకానిక్, డీజిల్ మెకానిక్ వంటి 21 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.








