పాక్ మహిళకు అభయమిచ్చిన సుష్మా
తనకు సాయం చేయాలన్న ఓ పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తికి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఆమె కోరినట్లుగా వీసా మంజూరు చేస్తామని సుష్మా ట్వీట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. నిదా షోయబ్ అనే పాకిస్తాన్ మహిళకు ఏడేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయి. తమ చిన్నారికి భారత్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని పాక్ మహిళ నిదా షోయబ్ అనుకున్నారు. ఆ మేరకు భారత్ వచ్చేందుకు వీసా కోసం ఆమె గత ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ తమ వీసా మంజూరు కాలేదని, ప్రాసెస్లోనే ఉందని కేంద్ర మంత్రి సుష్మాకు ట్వీట్లో తెలిపారు. ఆ విషయంపై స్పందించిన సుష్మస్వరాజ్ పాక్ మహిళకు అన్ని విధాల సాయం చేస్తామన్నారు. మీ ఏడేళ్ల పాపకు ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించవచ్చు. మీకు వీసా మంజూరు చేస్తాం. మీ పాప త్వరగా కోలుకోవాలని మేం కూడా ప్రార్థిస్తామంటూ ఆమె రీట్వీట్ చేశారు.













