విమానాల్లో హలో.. హలో
భారత గగనతలంలో ప్రయాణించే విమానాల్లో ప్రయాణిస్తూ ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా ఈ విషయం వెల్లడించారు. గత నాలుగేళ్లలో టెలికాం రంగంలో ప్రభుత్వం సాధించిన విషయాలను వివరిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ఒక సంవత్సర కాలంలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నా అన్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే మన దేశ గగనతలంలో ప్రయాణించే విమానాల నుంచి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. విమానాల్లో ప్రయాణించేటపుడు ఇంటర్నెట్తోనూ కనెక్ట్ అయి ఉండవచ్చు. టెలికాం కమిషన్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్త టెలికాం విధానాన్ని కేంద్ర కేబినెట్ వచ్చే నెల జరిగే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని కూడా మంత్రి తెలిపారు.













