ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ
మాజీ ప్రధాని ఇందిరగాంధీ మనుమరాలు, రాజీవ్-సోనియాల తనయ ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు అమెకు తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ ఆమె సోదరుడు, కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ స్టార్ క్యాంపైనర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు నేరుగా సవాల్ విసిరేందుకే ప్రియాంకను ఇక్కడ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూ, అభ్యర్థుల జాబితా తయారుచేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెకు ఓ పదవిని కేటాయించడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో చురుకైన ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించినట్లైంది. తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రాను నియమించారు. 2019 ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.













