కోవింద్ కుమార్తని అప్పుడే తెలిసింది..!
తండ్రి ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయితేనే వారి పేరు చెప్పి గొప్పలకు పోయే ‘బాబు’లున్న ఈ సమాజంలో.. తండ్రి ఉన్నత పదవిలో ఉండి కూడా సాధారణ వ్యక్తిగా చలామణీ కావడం కొందరికే సాధ్యం. అలాంటి కోవకే చెందుతారు రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి. ఒదిగి ఉండే స్వభావంలో తండ్రే అనుకుంటే.. అందులో ఆయనను మించిపోయారామె. ఇన్నాళ్లు కలిసి పనిచేస్తున్నా గురువారం వరకు ఆమెవరో తెలీదంటే ఆమె నిరాడంబరత ఏమిటో అర్థమైపోతుంది.
రామ్నాథ్ కోవింద్.. మొన్న భాజపా ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించనంత వరకు ఒక్క బిహార్కు తప్ప పెద్దగా పరిచయం లేని పేరు. గవర్నర్గా సేవలందిస్తున్న ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది. సరిగ్గా ఆయన కూమార్తె విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న స్వాతి ఎవరన్నది గురువారం రాష్ట్రపతిగా రామ్నాథ్కోవింద్ ఎన్నికయ్యేంత వరకు ఇంతకాలం పనిచేస్తున్నా అక్కడి ఉద్యోగులకు తెలీకపోవడం గమనార్హం.
ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే బోయింగ్ 777, 787 విమానాల్లో స్వాతి ఎయిర్హెస్టెస్గా వ్యవహరించేవారు. ఇన్నేళ్ల కాలంలో ఏ రోజూ ఫలానా రామ్నాథ్ కోవింద్ కుమార్తెనని ఆమె ఎవరితోనూ చెప్పకపోవడం గమనార్హం. ఆమెప్పుడూ సాధారణ ఉద్యోగిలానే వ్యవహరించారే తప్ప ఏ రోజూ గొప్పలకు పోలేదని ఓ ఉద్యోగి చెప్పారు. తన తండ్రి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆమె ప్రత్యేక సెలవులపై వెళ్లారు. అప్పుడు కూడా ఆమె సెలవులకు గల కారణాన్ని తెలపకపోవడం గమనార్హం.
కార్యాలయంలో ఆమె గురించిన అధికారిక వివరాల్లోనూ తన ఇంటి పేరును చేర్చకపోవడం విశేషం. తల్లి పేరును సవిత అని, తండ్రి పేరును ఆర్ఎన్ కోవింద్ అని మాత్రమే ఆమె పేర్కొన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుమార్తె అన్న విషయం గురువారం వరకు తమకు తెలీదని, ఆమెను తమ సహోద్యోగి అని చెప్పుకోవడానికి తాము గర్విస్తున్నామని అక్కడి సిబ్బంది అంటున్నారు. మరోవైపు ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించాలని రాష్ట్రపతి కోవింద్కు విన్నవించాలని అక్కడి సిబ్బంది యోచిస్తున్నారు.













